మొయినాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ మంగళవారం మొయినాబాద్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఎండగడుతుంటే తట్టుకోలేని ఆ పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. దీనిపై మరింత అవగాహన పెంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు ప్రభాకర్రెడ్డి, నీలకంఠం, సుధాకర్రెడ్డి, రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి


