ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు దాటవేసే ధోరణి అవలంబిస్తోందని, ఇది సరికాదన్నారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ను జిల్లా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ శ్రీనేష్కుమార్ నోరీ, కో చైర్మన్ గోపాల్, ప్రవీణ్, శాంతిశ్రీ, సుధాకర్, రాజేష్, బల్వంత్రెడ్డి, వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, మాధవ్, మహేశ్, ప్రమీల, వెంకటప్ప, పాండు, జగన్నాథ్ శర్మ, అరుణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.


