సిటీ కోర్టులు: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పాటిగూడ గ్రామానికి చెందిన బాలిక డిసెంబర్ 14న పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లి, సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. తమ కుమార్తె అదృశ్యం వెనుక అదే గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి ఉన్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 15న చందు అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భిక్షపతిగౌడ్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు రుజువుకావడంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.


