రాజేంద్రనగర్: స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్న ఓ విద్యార్థి ఉరేసుకున్నాడు. రాజేంద్రనగర్ ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్నగర్ జిల్లా గోపాలపేట మండలానికి చెందిన పి.మోహన్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. నగరానికి వలస వచ్చి రాజేంద్రనగర్ బన్సీలాల్నగర్లో నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో కుమారుడు పి.ప్రశాంత్(14) 8వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు ప్రతిరోజు వెళ్లి బుద్ధిగా చదువుకోవాలని ప్రశాంత్ను తల్లి మందలించడంతో రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. రెండురోజుల అనంతరం కుటుంబసభ్యులు వెతికి పట్టుకొచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్ ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మోహన్ ఇంటికి రాగా తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రశాంత్ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


