గచ్చిబౌలి: మృత్యువు వెంటాడి మరీ ప్రాణం తీసింది. ఓ ప్రమాదంలో గాయాలతో బయటపడగా.. మరో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ఖాజాగూడలో రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తి(35)ని ఇన్నోవా కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. కారు డ్రైవర్ జైద్ షాఖాద్రీ(21).. ఓ క్యాబ్ డ్రైవర్ సహాయంతో బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఖాజాగూడ నుంచి నానక్రాంగూడ వైపు వెళ్తున్న ఫార్చునర్ కారు ఢీకొట్టింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్నోవా డ్రైవర్ జైద్ షా ఖాద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైన నిందితుడి, కారు కోసం సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
● గాయపడ్డ వ్యక్తిని తరలిస్తుండగా ఢీకొన్న కారు
● ఒకరి మృతి, మరొకరికి గాయాలు


