పహాడీషరీఫ్: చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించి మూడు రోజుల క్రితం చెరువులో పడి ఉంటాడని భావిస్తున్నారు. 30–40 ఏళ్ల వయసు ఉంటుందని, అతని చొక్కాను షాద్నగర్లో కుట్టించినట్లు టైలర్ మార్క్ ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం
కేశంపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామ శివారు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది కిరణ్కుమార్, శివుడు మట్టిలోడ్తో వెళ్తున్న టిప్పర్లను గుర్తించారు. వాటిని ఆపి అనుమతులు ఉన్నాయా అని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించి టిప్పర్లను శనివారం రాత్రి స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. పెట్రోలింగ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
తల్లి మృతితో మనస్తాపం..
వ్యక్తి ఆత్మహత్య
అల్వాల్: తల్లి మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మిడిదొడ్డి అశారాణి (30) , అమె భర్త జగనాథ్ (33) ఓ కిమో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి జగన్నాథ్ బయిటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనం చేయాలని భార్య కోరగా తాను చేస్తానని చెప్పాడు. కొంత సమయం తర్వాత అశారాణి భర్తను చూసేందుకు వెళ్లాగా బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కినిపించాడు. వెంటనే సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ నెల 16న జగనాథ్ తల్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతితో తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్లో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.


