● షాబాద్ రైతువేదికలో ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం
● ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్, గుడిమల్కాపూర్ ఏఎంసీ చైర్మన్
షాబాద్: షాబాద్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో రైతు వేదికల వద్ద ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని మధుసూదన్రెడ్డి చెప్పగా.. మీరు అలా మాట్లాడటం తప్పు.. గత ప్రభుత్వంలో కూడా రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో కందిపంట సాగుపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వంలోనే క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించారని.. 5వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించినట్లు తెలిపారు. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వేదికపై పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ ఏంఎసీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ లేచి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో రైతువేదికల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదని, సబ్సిడీలు ఇవ్వలేదని.. మీరు గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో చేసిన పనులు చెబుతాను.. ఈ ప్రభు త్వం చేస్తున్న పనులను వివరిస్తాను.. మీరు కూ ర్చోండి అంటూ సమాధానం చెప్పారు. నేను 13 ఏళ్లుగా ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది నేనే. గత ప్రభుత్వంలో పనులు కాలేదని, రైతులకు ఏమి ఇవ్వలేదని, అవగాహన సదస్సులు పెట్టలేద ని మాట్లాడటం తప్పు అన్నారు. గత ప్రభు త్వంలో రైతువేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారని, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చారనే విష యాలు అధికారులకు తెలియదాఅని ప్రశ్నించారు.
సస్యరక్షణ చర్యలు పాటించాలి
కందిసాగులో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుజాత పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోపి రైతువేదికలో మిషన్ ఆత్మనిర్భర్ పల్సెస్ (ఎంఏఎన్పీ) పథకంలో ద్వారా రైతులకు కంది పంట క్లస్టర్ ఆధారిత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కంది పంటలో విత్తన శుద్ది, సమగ్రపోషక యాజమాన్యం కలుపు నివారణ, పురుగు, తెగుళ్ల సమగ్ర యాజమాన్య పద్ధతులు వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సర్ధార్నగర్ ఏఎంసీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ కార్యాలయం టెక్నికల్ ఏడీఏ పద్మజ, శాస్త్రవేత్త, దిలీప్, ఏఓ విజయచంద్ర, సర్పంచ్ అశోక్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, రైతులు, తదితరులున్నారు.


