సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 22–ఎ నిషేధిత జాబితా పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సాధారణ పని దినాల్లోనే కాకుండా సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ రికార్డులు, రిజిస్టర్లు, అందుబాటులో ఉన్న ధ్రువపత్రాలను పరిశీలించి, వాస్తవ వివరాల ఆధారంగా పారదర్శకమైన, స్పష్టమైన జాబితాను రూపొందించేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రక్రియను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆదివారం సెలవు రోజున సైతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా విధులకు హాజరై పరిశీలిస్తారని అన్నారు. 22–ఎ జాబితాలో అర్హత కలిగిన భూములు మాత్రమే ఉండేలా, అర్హత లేని సర్వే నంబర్లు తొలగించేలా పూర్తి స్థాయిలో రికార్డుల పరిశీలన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.


