ప్రజాపంపిణీ వ్యవస్థను మరింతపటిష్టం చేస్తాం స్మార్ట్ కార్డులతో జవాబుదారీతనం జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
ఇబ్రహీంపట్నం రూరల్: దేశ చరిత్రలో ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను శనివారం బొంగ్లూర్లోని ప్రమీదా గార్డెన్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సివిల్ సప్లయ్శాఖ మంత్రి ఉత్తమ్కూమార్రెడ్డి నేతృత్వంలో ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత పటిష్టం కానుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎప్పటికప్పుడు సరుకులు సులభంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కార్డులో క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను డిజిటల్ విధానంలో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కొత్తగా 78 రేషన్ షాపులు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీరపల్లి శంకర్, ప్రకాష్గౌడ్, అరికేపూడి గాంధీ, కాలె యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు వనజాత, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


