16 నియోజక వర్గాల్లో ముగిసిన ప్రక్రియ
సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు అనూహ్య స్పందన లభించింది. మొదటి దశలో భాగంగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల కోసం శనివారం సాయంత్రం వరకు 60,014 దరఖాస్తులు అందాయి. మరో నాలుగు నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించే 1,920 ఇళ్ల కోసం ఆదివారం నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. 16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం త్వరలోనే లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇళ్ల నిర్మాణాల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, సెప్టెంబరు మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. తాజాగా ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని ఎంపిక చేసిన భూముల్లో స్టిల్ట్ ప్లస్ 10 అంతస్తులతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నామని వివరించారు. ఆయా నియోజకవర్గాల ప్రజలు ‘మీ సేవ’ కేంద్రాల్లో సెప్టెంబరు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తి కోసం 040– 24603572ను సంప్రదించాలని ఆయన సూచించారు.


