ఇబ్రహీంపట్నం: గొర్రెలు, మేకల పెంపకందార్లు సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తమ సంఘం చేస్తున్న పోరాట ఫలితంగానే జీవాలకు మందులు, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా, సబ్సిడీ రుణాలు, మేత భూములపై, తుమ్మ చెట్లపై హక్కులు పొందినట్లు గుర్తు చేశారు. తరతరాలుగా గొర్రెలు, మేకల పెంపకాన్ని వృత్తిగా చేసుకొని సమాజానికి బలమైన ఆహారం అందిస్తున్న పెంపకందారులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, చేతివృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ పగడాల యాదయ్య, సంఘం జిల్లా కన్వీనర్ గొరింకల నర్సింహ, జిల్లా కార్యదర్శి అమీర్పేట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్


