
మృత్యుపాశాలు!
స్తంభాలకు ఉరితాళ్లుగా మారిన కేబుళ్లు లైన్ల పునరుద్ధరణ కోసం ఏటా రూ.కోట్లలో ఖర్చు అయినా మెరుగుపడని పంపిణీ వ్యవస్థ తరచూ తెగిపడుతున్న తీగలు చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వినియోగదారుల ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ లైన్లు.. జీవితాల్లో చీకట్లను మిగుల్చుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఈదురు గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ వైర్లు తెగి పడుతుండటాన్ని పరిశీలిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గకపోగా మరింత పెరుగుతుండటం, అమాయకులు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడుతుండం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ ఇంజనీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు భిన్న వాదనలు ముందుకు తెస్తున్నారు.
ముట్టుకుంటే షాకే..
ఇప్పటికీ ఎక్కడ చూసినా నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు లైన్లు సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, డీటీఆర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. విద్యుత్ ప్రమాదాలు ఆగడం లేదు. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు సెక్షన్ల వారీగా టీజీ గెయిన్స్ (జీఐఎస్ అసెట్ ఇన్స్పెక్షన్ అండ్ మేనేజ్మెంట్) పేరుతో సర్వే చేయించారు. దెబ్బతిని వంగిన స్తంభాలు, కిందికి వేలాడుతున్న వైర్లు, లూజ్ కాంటాక్ట్లు, ఎలాంటి రక్షణ లేని డీటీఆర్లు, ఫ్యూజ్బాక్స్లు, రింగ్ మెయిన్ యూనిట్లు, ఏబీ స్విచ్లు, హెచ్జీ ఫూ్య్జ్ బాక్స్లు 4.50 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా కొన్ని పనులు చేపట్టినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గలేదు. పలు బస్తీల్లోని ఇరుకు గల్లీల్లో ప్రమాదకరంగా మారిన కండక్టర్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు ప్రారంభించలేదు.
ఉరి తాళ్లుగా మారిన కేబుళ్లు
ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కండక్టర్లు, స్తంభాలు తెగిపడుతుంటే.. మరోవైపు వాటి మెడకు టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఏ స్తంభాన్ని పరిశీలించినా పెద్ద మొత్తంలో వైర్లు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా స్తంభాలకు జంక్షన్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ఇల్లీగల్గా కరెంట్ వాడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, అటు ఇటుగా ఉన్న స్తంభాలు విరిగిపడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూ విద్యుత్ అంతరాయాలకు కారణమవుతున్నా ఆపరేటర్లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
నెత్తిన వేలాడుతున్న విద్యుత్ వైర్లు

మృత్యుపాశాలు!