పోగొట్టుకున్న సెల్ఫోన్లు రికవరీ
ఇబ్రహీంపట్నం: సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు వాటిని రికవరీ చేసి మంగళవారం అప్పగించారు. ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపిన ప్రకారం.. సెల్ఫోన్లను పోగొట్టుకుని తమకు ఫిర్యాదు చేసిన బాధితులకు సీఎంఐఆర్ పోర్టల్ సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు పది సెల్ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, శ్రీనివాస్ తదితరులున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కందుకూరు: కందుకూరు ఠాణా పరిధిలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కొత్తగూడ పంచాయతీ పరిధి బాలాజీ వెంచర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు 40–45 సంవత్సరాలు ఉంటుందని.. ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. కొద్ది రోజులుగా కందుకూరు చౌరస్తాలో భిక్షాటన చేసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712662687 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
వాహనాల బ్యాటరీలు చోరీ
షాద్నగర్: పార్క్ చేసిన వాహనాల నుంచి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీలను చోరీ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో పాటు గ్రామానికి చెందిన వాడ్యాల శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్యకు చెందిన ట్రాక్టర్ల నుంచి, వడ్డె శంకర్ ఆటోలోని బ్యాటరీలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పిడుగుపాటుకు పశువులు మృత్యువాత
కొందుర్గు: పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని శ్రీరంగాపూర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బుయ్యని లాలయ్య మంగళవారం ఉదయం తన ఎద్దులను మేపి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు కట్టేసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం తగ్గిన తర్వాత పొలానికి వెళ్లి చూడగా పిడుగుపడి ఓ ఎద్దు మృత్యువాత పడింది. మృతి చెందిన ఎద్దు విలువ సుమా రు రూ.70 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
కుర్మిద్దలో ఆవు..
యాచారం: పిడుగు పాటుకు ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కుర్మిద్దలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుల సత్తయ్య రెండు నెలల క్రితం రూ.90 వేలు వెచ్చించి పాడి ఆవులను కొనుగోలు చేశాడు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడడంతో వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు కట్టేసిన ఆవు మృత్యువాత పడింది. ఆవుతోనే జీవనోపాధి పొందుతున్నానని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
పోగొట్టుకున్న సెల్ఫోన్లు రికవరీ
పోగొట్టుకున్న సెల్ఫోన్లు రికవరీ


