జేఎన్టీయూ స్కామ్‌! | - | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూ స్కామ్‌!

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

పాత లావాదేవీలపైనా విచారణ జరగాలి

అసలు సూత్రధారి ఎవరు?

గోల్‌మాల్‌లో మరింత మంది పాత్ర!

రెండేళ్ల క్రితమే జీఎస్టీ అవకతవకలపై ఉన్నతాధికారి మందలింపు

ఆ పరిణామంతో నెలరోజులు సెలవుపై వెళ్లిన క్లర్క్‌

కొండగట్టు అక్రమాలతో హైదరాబాద్‌కు లింకు?

లోతుగా దర్యాప్తు జరపాలంటున్న విద్యార్థి సంఘాలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

కొండగట్టు జేఎన్టీయూలో వెలుగుచూసిన జీఎస్టీ కుంభకోణం కలకలం రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ జేఎన్టీయూలో రూ.1,000 కోట్ల ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ వెలుగుచూసిన దరిమి లా.. దానికి అనుబంధంగా ఉన్న కొండగట్టు జేఎన్టీ యూ ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ సరిగా అలాంటి కుంభకోణమే బయటపడడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు కళాశాలకు చెల్లించిన ఫీజులో చెల్లించాల్సిన జీఎస్టీలో తేడాలు రావడంతో గడబిడ మొదలైంది. కొండగట్టు జేఎన్టీయూలో విద్యార్థులు చెల్లించిన ఫీజు నుంచి జీఎస్టీకి కట్టాల్సి న రూ.5.23 లక్షలను ఓ క్లర్కు తన కూతురు, అల్లుడు ఖాతాలోకి మళ్లించాడన్న ఆరోపణలపై ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వెలుగుచూసిన స్కాం రూ.5.23 లక్షలకే పరిమితమా.. అంతకన్నా ఎక్కువగా ఉందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో కేవలం ఏడాది కాలంలో ఈ కుంభకోణం జరగలేదని, గత పదేళ్లుగా ఇదే పంథాలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకోవడంతో అందరి దృష్టి కొండగట్టు జేఎన్టీయూపై పడింది.

గతంలో హెచ్చరించినా మారని తీరు

జీఎస్టీలో తేడాలు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. వాస్తవానికి రెండేళ్ల క్రితం ఓ ఉన్నతాధికారి వద్దకు ఇలాగే జీఎస్టీ బిల్లులలో తేడాగా నమోదు చేసి తీసుకెళ్లిన సందర్భంలో ఆ ఉద్యోగికి అక్షింతలు పడ్డాయని సమాచారం. సదరు ఉద్యోగి తన తప్పును కప్పిపుచ్చుకునే యత్నం చేయగా.. తన వద్ద లెక్కలు సరిగ్గా ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నతాధికారి స్పష్టం చేశారని తెలిసింది. ఆ వాగ్వాదం అనంతరం సదరు ఉద్యోగి మెడికల్‌ లీవుపై నెలరోజులపాటు వెళ్లాడు. అదే సమయంలో జేఎన్టీయూ హైదరాబాద్‌ నుంచి ఓ అధికారి ఆ ఉద్యోగికి దన్నుగా నిలిచాడని ప్రచారం సాగుతోంది. అతను వారం లీవులు పెడితే.. అందులో రెండురోజులే అధికారికంగా నమోదయ్యేదని, మిగిలినవి పనిదినాలుగా సంతకాలు చేయించుకునేవారని ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో పోలీసులు కేవలం పాత్రధారుడిపైనే కేసు నమోదు చేశారని, అసలు సూత్రధారి వేరే ఉన్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు లోతుగా ఆరా తీయాలని లేకపోతే మరో ఉద్యోగిని బలిపశువు చేసి సూత్రధారులు తప్పించుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జేఎన్టీయూకు అనుబంధంగా కొండగట్టులో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉపకార వేతనాలు రాని విద్యార్థులు నేరుగా హాస్టల్‌కు చెల్లించే ఫీజులు కాలేజ్‌ అకౌంట్‌ కాకుండా యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగి అకౌంట్‌కు వెళ్లడంపై పూర్తి విచారణ జరగాలి. ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి జేఎన్టీయూలో పెద్దస్థాయి అధికారి అండ ఉంటేనే ఈ విధంగా చేయగలుగుతాడు. కేవలం ఏడాది ఫీజులపై కాకుండా గత మూడు విద్యా సంవత్సరాలు జరిగిన ఫీజుల లావాదేవీలపై విచారణ జరిపించాలి. అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement