ముస్తాబాద్(సిరిసిల్ల): ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్న కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని ముస్తాబాద్లోని అంబేడ్కర్నగర్ కాలనీలో మహిళలు మంగళవారం ధర్నా చేపట్టారు. ముస్తాబాద్, సిద్దిపేట ప్రధాన రహదారి డివైడర్ల మధ్య కోనోకార్పస్ చెట్లను తొలగించాలని రోడ్డుపై బైఠాయించగా, వార్డు సభ్యుడు నరేశ్ తదితరులు మద్దతు తెలిపారు. అయితే సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు అడ్డుగా ఉన్న చెట్లను పంచాయతీ సిబ్బంది తొలగించారు. కాగా, మొత్తం చెట్లను తీసేయాలని కాలనీ వాసులు కోరారు. ఆ చెట్లతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై జ్యోతి ఘటన స్థలానికి చేరుకుని మహిళలను శాంతింపచేశారు. నిబంధనల మేరకు అనుమతులు తీసుకుని చెట్లను తొలగిస్తామని పంచాయతీ కార్యదర్శి రమేశ్ తెలిపారు.


