● నేటి నుంచి పంపిణీ ● జిల్లాలో 1,95,915 కార్డులు ● 5,36,051 మందికి లబ్ధి ● ఇప్పటికే మండలాలకు చేరిన వైనం
ముస్తాబాద్(సిరిసిల్ల): రేషన్కార్డు.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా. ఆహారభద్రత కార్డు పుష్కరకాలం తర్వాత లబ్ధిదారుల చేతికి చేరుతుంది. స్మార్ట్రేషన్కార్డులను శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,95,915 కార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
మహిళల పేరుతో ఆహారభద్రత
ఇంటి యజమానిగా మహిళల పేరుతో కొత్త స్మార్ట్ రేషన్కార్డులను అందిస్తున్నారు. మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందనే సంకేతాలు ఇస్తోంది. నకిలీ కార్డులు సృష్టించకుండా అత్యంత భద్రతతో తొమ్మిది రకాల ఫీచర్లతో స్మార్ట్కార్డులను తయారు చేశారు. ఆధునిక భద్రత ఫీచర్లతో.. కార్డును స్కాన్ చేయగానే లబ్ధిదారుల పూర్తి వివరాలు కనిపిస్తాయి. కార్డులపై సీఎం రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు ఉంటాయి. ఇంటి యజమాని పేరు, రేషన్కార్డు నంబర్, రేషన్ దుకాణం నంబర్లు ఉంటాయి. పారదర్శకంగా సేవలు అందించేలా హోలోగ్రామ్, అతిచిన్న మైక్రోటెక్స్ట్ ఉన్నాయి. కార్డుపై ఇంపోజ్డ్ లెటర్స్, ప్రభుత్వ చిహ్నం, ఇన్విజిబుల్ యూవీ, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, గిల్లోషే ప్యాటర్న్ వంటి అత్యాధునిక సాంకేతిక భద్రత ప్రమాణాలతో కార్డును తయారు చేశారు.
వివరాలు ఇలా..
అంత్యోదయకార్డులు : 13,832
సాధారణ కార్డులు : 1,82,083
మొత్తం కార్డులు : 1,95,915
లబ్ధిదారులు : 5,36,051
ప్రతీ నెల బియ్యం : 3,702 మెట్రిక్ టన్నులు
నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శనివారం స్మార్ట్ రేషన్కార్డులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చి బాబు శుక్రవారం తెలిపారు. రగుడు వద్ద గల మల్లికార్జున ఫంక్షన్హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేస్తామని వివరించారు.
14ఎస్ఆర్ఎల్76 : ఆహార భద్రత స్మార్ట్కార్డు


