● తరచూ మిషన్ భగీరథ పైపుల లీకేజీ ● రంగుమారుతున్న తాగునీరు ● గ్రామాల్లో అపరిశుభ్రంగా నీటిట్యాంక్లు ● పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అసలే వర్షాకాలం.. జ్వరాలు ప్రబలుతున్న సమయం.. వాంతులు, విరోచనాలతో పల్లెజనం మంచంపడుతున్నారు. ఈ సమయంలోనే మిషన్ భగీరథ నీరు రంగు మారి వస్తోంది. తరచూ లీకేజీలు ఏర్పడుటుండడంతో జనం ఇబ్బందిపడుతున్నారు.
అపరిశుభ్రంగా వాటర్ట్యాంక్లు
రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 339 ఆవాసాల్లో ఓవర్హెడ్ ట్యాంక్లు 594 ఉన్నాయి. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రతీ నెల 1, 11, 21వ తేదీల్లో ఓవర్హెడ్ట్యాంక్లను శుభ్రం చేయాలి. కానీ సమయం ప్రకారం ఎక్కడ శుభ్రం చేయడం లేదు. దీంతో వాటర్ట్యాంక్లలో నీటి ద్వారా వచ్చే మలినాలు పేరుకుపోతున్నాయి.
తరచూ లీకేజీలు
ఇటీవల జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడుతున్నాయి. వేములవాడ అర్బన్ మండలం నందికమాన్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. అంతకుముందు కోనరావుపేట మండలంలోనూ మిషన్ భగీరథ పైపులై న్ పగిలి తాగునీరు కలుషితమవుతుంది. జిల్లా వ్యా ప్తంగా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల నుంచి పైపులైన్లు పోతుండడం.. రైతులు పొలం పనుల్లో భాగంగా ట్రాక్టర్లతో దుక్కులు దున్నించడం, అక్కడక్కడ బోర్లు వేయించిన ప్రాంతాల్లో అడ్డుగా పైపులైన్ ఉన్న విషయం తెలియక పగిలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిని మరమ్మతు చేసే లోపే అక్కడ పేరుకుపోయిన బురదనీరు తిరిగి పైపులైన్లలోకి వెళ్లి మిగతా నీటితో కలిసి సరఫరా కావడంతో కలుషితమవుతున్నాయి.


