వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుంటుంటారనీ, భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఈవో రమాదేవి హెచ్చరించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయంలో నాయీబ్రాహ్మణులతో మాట్లాడారు. భక్తులను నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందన్నారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఈవో జయకుమారి, నాగుల మహేశ్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, రాజేందర్ పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు చెల్లించాలి
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పేద విద్యార్థులకు బకాయిపెట్టిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి డిమాండ్ చేశా రు. విద్యార్థుల హక్కుల సాధనకు ‘ఫీజు బకాయి– బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. జింక అనిల్, రాజ్కుమార్, పెద్దూరి పరశురాంగౌడ్, కోడం శివప్రసాద్, చిందం నరేశ్, జితేందర్రెడ్డి, మల్లడపాట భాస్కర్ పాల్గొన్నారు.
నైపుణ్యాలు వెలికి తీసేందుకు క్రీడలు దోహదం
సిరిసిల్లఅర్బన్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడాపోటీలు దోహదపడుతాయని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాలీబాల్ పోటీల్లో 30, త్రోబాల్లో 7 జట్లు పాల్గొంటాయని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్రెడ్డి, సురేశ్, ప్రభాకర్, బీజేపీ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.


