కలిసిరాని కాలం
జిల్లాలో జలాశయాలు... నీటి లభ్యత
అన్నదాతలను వెంటాడిన క(న)ష్టాలు
అకాల వర్షాలతో అపారనష్టం
నిండిన జలాశయాలు
ఉబికివచ్చిన భూగర్భ జలాలు
విభిన్న పంటల సాగు
సిరిసిల్ల: ప్రకృతిని నమ్ముకున్న రైతులకు 2025లో కష్టాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడడంతో జలాశయాలు నిండాయి. చెరువులు.. కుంటలకు జలకళ చేరింది. భూగర్భ జలాలు రికార్డుస్థాయిలో పైకి చేరాయి. కానీ వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) సీజన్లలో అకాల వర్షాలు అన్నదాతల ఆశలను ఆవిరిచేశాయి. ఛీడపీడలతో తెల్లబంగారం నల్లగా మారింది. నాలుగేళ్ల క్రితం సాగుచేసిన ఆయిల్పామ్ పంట కోతకు రావడం విశేషం. జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగినా.. పంట దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది అన్నదాతలు మిశ్రమ ఫలితాలను అనుభవించారు.
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయి. కౌలురైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సొంతంగా ఉన్న కొద్ది పాటి భూమికి తోడుగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేయగా నోటికాడి బుక్క నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నేల పాలయ్యాయి. వానాకాలంలోనూ సెప్టెంబరులో కురిసిన వర్షాలకు కోతకొచ్చిన వరి నేలపాలైంది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి రెండుసార్లు ప్రకృతి కన్నెర్రలతో పంటనష్టాలు తప్పలేదు. చివరికి వానాకాలం సీజన్ దిగుబడి భారీగా తగ్గిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
జిల్లాలో కొత్త పంట దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో తొలిసారి ఆయిల్పామ్.. దిగుబడి సాధించారు. నాలుగేళ్ల క్రితం మొక్కలను నాటి సంరక్షించిన రైతులకు పంట దిగుబడి వస్తుంది. ఆయిల్పామ్ గెలలు.. దాని ప్రాసెసింగ్ జిల్లా రైతులకు కొత్తే. కానీ ఆయిల్పామ్ సాగుతో బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కసారి మొక్కలు నాటితే 35 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,300 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారు. ఈ ఏడాది 2వేల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1,160 ఎకరాల్లో 331 మంది సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే 120 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయింది. ఆయిల్పామ్ పంటకు టన్ను(పది క్వింటాళ్ల)కు ధర రూ.18,052గా ఉంది. బోయినపల్లి, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో 292 మంది 978 ఎకరాలలో సాగు చేయగా ఈ ఏడాది 450 టన్నుల పంట దిగుబడి వచ్చింది.
ఒకప్పుడు జిల్లాలో సాగునీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నాలు చేసేవారు. జిల్లాలో వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా చుక్కనీరు రాని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నీటి ఊటలు పెరిగిన జిల్లాగా పేరొచ్చింది. దేశంలో శిక్షణ పొందే ఐఏఎస్లకు జిల్లాలోని భూగర్భజలాల పెంపు పాఠ్యాంశమైంది. బోయినపల్లి వద్ద మధ్యమానేరు జలాశయం, గంభీరావుపేట వద్ద ఎగువమానేరు, కోనరావుపేటలో మూలవాగు, జిల్లెల్లలో నక్కవాగు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో 666 చెరువులు ఉండగా 458 నిండాయి. జిల్లాలో శాసీ్త్రయంగా భూగర్భ జలాలను అంచనా వేసేందుకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్(డీడబ్ల్యూఎల్ఆర్) ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో వరి పంట ద్వారా రూ.1,550.83 కోట్లు, పత్తి ద్వారా రూ.211 కోట్లు మేరకు ఆర్జించారు.
ఆయిల్పామ్ గెలలతో అధికారులు, రైతులు
మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం 27 టీఎంసీలు
అన్నపూర్ణ(అంతగిరి) జలాశయం
3 టీఎంసీలు
ఎగువమానేరు : 2.25 టీఎంసీలు
మల్కపేట రిజర్వాయర్ : 1.5 టీఎంసీలు
నిమ్మపల్లి మూలవాగు : ఒక్క టీఎంసీ
సింగసముద్రం చెరువు: 0.5 టీఎంసీ
జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు సాగుచేశారు. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2,40,038 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వరిని 1,84,800 ఎకరాల్లో సాగుచేయగా.. రెండో స్థానంలో 45 వేల ఎకరాల్లో పత్తి వేశారు. ఇతర పంటలను ఈ ఏడాది బాగానే సాగుచేశారు. పత్తి పంట కొనుగోలుకు జిల్లాలో ఐదు జిన్నింగ్ మిల్లులు ఉండగా.. ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయించారు.
రికార్డుస్థాయిలో పంటల సాగు
కలిసిరాని కాలం
కలిసిరాని కాలం
కలిసిరాని కాలం


