కలెక్టరేట్‌లో లీకువీరుడు! | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో లీకువీరుడు!

Apr 18 2025 1:49 AM | Updated on Apr 18 2025 1:49 AM

కలెక్

కలెక్టరేట్‌లో లీకువీరుడు!

● సిరిసిల్లలో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి ● ఆయన శాఖలో తరచుగా లోపాలు గుర్తిస్తున్న కార్యాలయం ● అటెన్షన్‌ డైవర్షన్‌ కోసం కార్యాలయంపై దుష్ప్రచారం ● సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో ఇదే తంతు ● ధరణి, లే అవుట్ల విషయంలో పలుమార్లు భంగపాటు ● ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్‌?

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ కొంతకాలంగా పలుసంచలనాలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఓ అధికారి తీరే ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. కొన్నినెలలుగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరుగుతున్న పలు పరిణామాలను, విధాన పరమైన నిర్ణయాలను తప్పుడుగా ప్రచారం చేస్తున్న అధికారిపై కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌ సైతం అతని తీరుపై గుర్రుగా ఉన్నారని, జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఈ విషయం సిరిసిల్ల కలెక్టరేట్‌లో చర్చానీయాంశంగా మారింది.

ఇంతకీ ఎవరాయన?

ఐదారేళ్లుగా సిరిసిల్ల జిల్లాలో పాతుకుపోయిన సదరు అధికారికి స్థానిక రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా భూవివాదాలకు సంబంధించిన విషయాల్లో సదరు అధికారి అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. తన శాఖలో ఏం జరుగుతుందన్న విషయం గాలికి వదిలి.. నిత్యం ధరణి, లే అవుట్ల విషయంలో తల దూరుస్తూ.. వివాదాస్పద విషయాలను కార్యాలయానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టరేట్‌ వర్గాలు గుర్తించాయి. ఆయన పనిలో ఎపుడు లోపాల్ని గుర్తించినా.. వెంటనే తనపై ఎవరూ శ్రద్ధ పెట్టకుండా.. వెంటనే కలెక్టర్‌ కార్యాలయంపై ఏదో తప్పుడు ప్రచారం చేసి, తనపై చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లడం, కలెక్టర్‌ కార్యాలయానికి లీవులపై కనీస సమాచారం ఇవ్వకపోవడం, ప్రభుత్వ సమీక్షాసమావేశాలకు తరుచుగా ఆలస్యంగా వస్తుండటంతో అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరిగినా ఆయన బదిలీ కాకపోవడం గమనార్హం.

భూములంటే అమితాసక్తి..

ఇటీవల ధరణి రికార్డుల్లో మార్పులు చేర్పులు, లేఅవుట్ల విషయంలో కలెక్టరేట్‌లో ఆయన అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. ఒక సందర్భంలో ఏకంగా కలెక్టర్‌ అనుమతి లేకుండా ధరణిలో రికార్డులు మార్చేందుకు సదరు అధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. రికార్డులు మార్చే అధికారి ముందుజాగ్రత్తగా.. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దూరు, ఆగ్రహారంలో పలువురు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి సహకరించిన విషయాన్ని కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ముందస్తుగానే పసిగట్టడంతో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. తన అక్రమాలు, శాఖలో లోపాలు బయటపడ్డ ప్రతీసారీ.. కలెక్టర్‌ కార్యాలయంలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారంచేసి ఇతరులపై దృష్టి మరల్చేలా చేస్తున్నారని సమాచారం. ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భోజన ఖర్చులపై దుమారం, ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పర్యటన సందర్భంగానూ.. జరిగిన పరిణామాల వెనుక సదరు అధికారే ఉన్నారని కలెక్టర్‌ కార్యాలయం గుర్తించింది. తమకు తరచుగా ఆటంకాలు కలిగిస్తున్న ఆ అధికారిని సరెండర్‌ చేయాలని నివేదిక పంపేందుకు కలెక్టర్‌ సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.

కలెక్టరేట్‌లో లీకువీరుడు!1
1/1

కలెక్టరేట్‌లో లీకువీరుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement