రోడ్లు ధ్వంసం..వాగులు చెర
● అటవీ ప్రాంతంలో జోరుగా ఇసుక అక్రమ రావాణా ● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● ధ్వంసమవుతున్న ఒర్రెలు, రహదారులు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
రుద్రంగి(వేములవాడ): అటవీ ప్రాంతం, వాగులు, ఒర్రెలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక ట్రాక్టర్ల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు. ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ల వేగానికి రోడ్లు ధ్వంసమవుతున్నాయి. వాగులు, ఒర్రెల్లో ఇసుక తోడుతుండడంతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటున్నారు.
ఒర్రెలు ఖాళీ..
మండలంలోని వాగులు, ఒర్రెల్లో ఇసుక ఖాళీ అవుతోంది. అదే సమయంలో ఇసుక ట్రాక్టర్ల వేగానికి రోడ్లు సైతం ధ్వంసమవుతున్నాయి. మండుతున్న ఎండలకుతోడు ఒర్రెలలోని ఇసుకను తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోరుబావుల్లో నీరు ఇంకిపోతోంది. పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రావాణాను అరికట్టాలని కోరుతున్నారు.
మైనర్, ర్యాష్ డ్రైవింగ్తో బెంబేలు
ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లలో దాదాపు మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. అంతేకాకుండా వారిలో చాలా మందికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉండడం లేదు. ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ఈ ఫొటోలో పేద్ద కాల్వ ఇసుక తవ్వకాలు చేపట్టడంతోనే ఏర్పడింది. ఇది రుద్రంగి మండల కేంద్రం శివారులోని దుర్గమ్మఒర్రె. ఇష్టానుసారంగా ఇసుక తీయడంతో భారీ గోతులు ఏర్పడి వర్షాకాలంలో ఒర్రె కోసుకుపోయింది. దీంతో పక్కనున్న పంటపొలాలకు వరదనీరు వస్తోందని స్థానిక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తోడకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇది రుద్రంగి మండలంలోని అచ్చయ్యకుంట నుంచి కలికోటసూరమ్మ చెరువులోకి వెళ్లే దారి. ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ల రాకపోకలతో ఈ రోడ్డు ధ్వంసమైంది. అటు వైపు పొలాల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పాడవుతుందని ఆ ప్రాంతంలోని రైతులు ప్రశ్నిస్తే ఎవరికీ చెప్పుకుంటావో.. చెప్పుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు వారు వాపోయారు.
ఇక నుంచి అనుమతులు ఇవ్వం
రుద్రంగిలో ఇసుక రవాణాకు ఇక నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వం. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీలత, తహసీల్దార్, రుద్రంగి
కేసులు నమోదు చేస్తాం
అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తీసుకోకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం. – సిరిసిల్ల అశోక్, ఎస్సై, రుద్రంగి
రోడ్లు ధ్వంసం..వాగులు చెర
రోడ్లు ధ్వంసం..వాగులు చెర
రోడ్లు ధ్వంసం..వాగులు చెర


