ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!

Mar 20 2025 1:36 AM | Updated on Mar 20 2025 1:36 AM

ధాన్య

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!

● యాసంగి కొనుగోళ్లు ఐకేపీలకే.. ● సహకార సంఘాలకు ‘నో చాన్స్‌’ ● జిల్లాలో 259 కేంద్రాలు ● గతంలో ఐకేపీ 44, ప్యాక్స్‌ కేంద్రాలు 202 ● డీసీఎంఎస్‌ కేంద్రాలు 9, మెప్మా కేంద్రాలు 4

సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్లకు మహిళా సంఘాలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) అధికారులకు సమాచారం అందించారు. యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1,78,350 ఎకరాల్లో వరి సాగుచేశారు. 4.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాదిత యాసంగి సీజన్‌లో 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) ఆధ్వర్యంలోనే 202 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) పరిధిలో 44 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 9, మెప్మా పరిధిలో 4 కేంద్రాలను ప్రారంభించి వడ్లను కొన్నారు. ఈ ఏడాది మాత్రం ఎక్కువ స్థానాల్లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే మహిళా సంఘాలను పర్యవేక్షించే డీఆర్‌డీఏ అధికారులకు జిల్లా ముఖ్య అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మహిళా సంఘాలతో సాధ్యమేనా..?

గతేడాది ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఐరిష్‌(కంటిపాప) నమోదు విధానాన్ని అమలు చేశారు. భోగస్‌ రైతులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. అసలైన రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 170 ఐరిష్‌ మిషన్లు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మరో పక్షం రోజుల్లో వరికోతలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలు చేపట్టాలనే నిర్ణయం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు మాత్రం సింగిల్‌విండోలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలనే నిర్ణయాన్ని మెజార్టీ పీఏసీఎస్‌(పాక్స్‌)లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం సహకారం సంఘాలకు ఎన్నికై న పాలకవర్గాలు లేవు. ప్రభుత్వ ఆదేశాలతో ఆరు నెలలు పొడగింపు సంఘాలు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉంటాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. కానీ కాలక్రమంలో ఐకేపీ కేంద్రాల సంఖ్యను తగ్గిస్తూ పీఏసీఎస్‌లకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు. దీంతో జిల్లాలో సహకార సంఘాలదే అగ్రస్థానమైంది. మళ్లీ ఇప్పుడు మహిళలకు ఆ బాధ్యతలను ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా స్పష్టత రాలేదు

ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సమక్షంలో సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశం జరిగితే కొనుగోళ్ల బాధ్యత ఎవరిదో తెలుస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. గతంలో ఐకేపీ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. మహిళా సంఘాలకే ధాన్యం కొనుగోళ్ల బాధ్యతపై స్పష్టత రాలేదు.

– శేషాద్రి, డీఆర్‌డీవో

సహకార సంఘాలకే అప్పగించండి

వేములవాడఅర్బన్‌: సహకార సంఘాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేసేలా చూడాలని జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు విన్నవించారు. బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అవినీతికి తావు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. 2010లో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చొరవతో సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌లు, నాయకులు గుండారపు కృష్ణారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నర్సయ్య, భాస్కర్‌గౌడ్‌, దేవదాస్‌ ఉన్నారు.

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!1
1/2

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!2
2/2

ధాన్యం బాధ్యత మహిళా సంఘాలదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement