ఒంగోలు సిటీ: జాతీయ స్థాయి సైన్స్ సెమినార్ 2026 లో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. విద్యార్థులను, గైడ్ టీచర్లను అభినందించారు. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా తమ ఆలోచనలు, పరిశోధనలు, భవిష్యత్తు దృక్పథాలను వెల్లడించారు. ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలకూరపాడు విద్యార్థిని వై.నిహారిక, ఏపీ మోడల్ స్కూల్ వీరేపల్లికి చెందిన విద్యార్థిని జీవీ యజ్ఞశ్రీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలకు ఉప విద్యాశాఖాధికారి రంగయ్య బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వై రవి శంకర్, డి శివ నాగయ్య జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి రమేష్, ఎన్ నాగేశ్వరరావు, కేఎస్ రవికాంత్, పీ రమణయ్య, కే రాము, తదితరులు పాల్గొన్నారు.


