ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రకాశం భవనంలోని ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ పి.రాజాబాబు, ఇతర అధికారులు, నేతలు నివాళులర్పించారు. తొలుత ఆంధ్ర కేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని చేరుకోవటంలో ప్రకాశం పంతులు మన అందరికీ దర్శనీయమన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్కుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్వో పీవీ రమణ, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ముఖ్యమంత్రిగా ఎదిగిన టంగుటూరి ప్రకాశం పంతులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి నిర్వహించారు. ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడిగా టంగుటూరి ప్రకాశం పంతులు పేరొందారని చెప్పారు. ప్రకాశం పంతులు మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏఆర్, డీపీఓ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


