● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: శ్రీ చైతన్య నవోదయ స్కూలు విద్యార్థి తౌషిక్ మృతిపై న్యాయపోరాటం చేస్తున్న తల్లి సయ్యద్ మౌలాబి న్యాయపోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి విద్యార్థి తౌషిక్ కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ స్కూలు యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్, స్కూలు నిర్వహించటం వాస్తవమని ఆరోపించారు. గత మార్చి 19వ తేదీ డీఈఓ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం స్కూలు నిర్వహిస్తున్నారని, ఈ విద్యా సంవత్సరానికి మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే స్కూలు యాజమాన్యం డీఈఓ ఇచ్చిన ఆదేశాలపై కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి పాఠశాల నిర్వహిస్తోందని చెప్పారు, తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ ఆలీ, మౌలాబీలు తమ కొడుకు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారన్నారు. నిబంధనలకు విరుద్దంగా పాఠశాల నిర్వహిస్తున్నారని వారికి కలిగినట్లు మరో తల్లికి కడుపుకోత ఉండకూడదని కోర్టు స్టే ఎత్తివేసేలా న్యాయపోరాటం చేస్తామన్నారు. మౌలాబి చేస్తున్న న్యాయపోరాటానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నానని, విద్యార్థి తౌషిక్ మృతి పై జరుగుతున్న విచారణ వేగవంతం గా జరిగేలా కృషి చేస్తానన్నారు. తౌషిక్ కుటుంబానికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. సురేష్ను కలిసిన వారిలో తౌషిక్ తండ్రి ఆలీ, అన్న తౌఫిక్, బంధువులు సయ్యద్ హైదర్ఆలీ, మహబూబ్, హ్యూమన్ రైట్స్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మద్దిశెట్టి భారతి, పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, గ్రామ అధ్యక్షుడు షేక్ కరీం, షేక్ అల్లాభక్షు, షేక్ ఇంతియాజ్, షేక్ కరిముల్లా, షేక్ జిలాని, తదితరులు ఉన్నారు.


