‘గూడు’కట్టుకున్న
నిర్వేదంతో సుంకేశులగ్రామ మహిళ
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 11 గ్రామాల ప్రజల్లో తీవ్ర ఆవేదన గూడుకట్టుకుంది. అధికారులు తమ మెడపై కత్తిపెట్టి ఖాళీ చేస్తారా.. లేదా.. అని ప్రతిరోజూ గ్రామాలకు వచ్చి చెబుతున్నారని, పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టకుండా.. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా.. తాము ఇళ్లు ఖాళీచేసి వస్తే గొడ్డుగోదా.. పిల్లా జల్లా.. ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. గొట్టిపడియ, అక్కచెరువు తాండ, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల, కాటంరాజుతాండ, మాగుటూరు తండాలోని లక్ష్మీపురం, కృష్ణానగర్ తదితర గ్రామాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు నిర్వాసితులు ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే.. అనే నిర్వేదంతో పెట్టే బేడ సర్దుకుని మార్కాపురం, కంభం పట్టణాలకు పయనమవుతున్నారు. రేకుల షెడ్లు ఉన్నవారు రేకులను, మరికొందరు తలుపులు, కిటికీలు, ద్వార బంధాలను ఊడదీస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుట్టిపెరిగిన సొంతూరు.. జీవనాధారంగా ఉన్న పొలాలు, తమ వారితో కలిసి బతికిన జ్ఞాపకాలు వదిలి రావాలంటే మనసొప్పడంలేదని గొట్టిపడియ గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం 6 నెలల గడువైనా ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం మాకు ప్యాకేజీ, పునరావాసం కల్పిస్తేనే వస్తామని, లేదంటే ఇక్కడే ఉంటామని చెబుతున్నారు.
స్టైఫండ్పై హామీ ఇచ్చేంత వరకు పోరాటం


