రాచర్ల: నిరుడు వరద పరవళ్లతో ఉధృతంగా ప్రవహించిన గుండ్లకమ్మ వాగు.. నేడు ఎల్నినో ఎండమావుల్లో చిక్కి బొట్టు నీరు లేక విలవిల్లాడుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాలు ముఖం చాటేయడంతో వాగు పూర్తిగా అడుగంటింది. చారిత్రక నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుండం మొదలుకొని కంభం పెద్ద చెరువు వరకు జలకళ కోల్పోయి బోసిపోయాయి. అడవిలోని వన్యప్రాణులు, పశువులకు గొంతు తడుపుకునేందుకూ చుక్కనీరు దొరకని దైన్యం దాపురించింది. వాగు పరీవాహక ప్రాంతాలైన రాచర్ల, చోళ్లవీడు, అచ్చంపేట, తుడిమెళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వ్యవసాయ బోర్లు ఒట్టిపోవడంతో కళ్లముందే ఎండిపోతున్న పైర్లను చూసి అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.


