ఒంగోలు సబర్బన్:
స్వాతంత్య్ర పోరాటంలోనూ, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ‘‘ సర్దార్ ’’ గౌతు లచ్చన్న అని కలెక్టర్ పి.రాజా బాబు కొనియాడారు. గౌతు లచ్చన్న 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రకాశం భవనంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం తన జీవితకాలమంతా లచ్చన్న శ్రమించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకై న పాత్ర పోషించారని చెప్పారు. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలనే నినాదంతో 1937లో ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతులతో పాదయాత్ర చేయటం ఆయా వర్గాల పట్ల లచ్చన్నకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసిందని వివరించారు. లచ్చన్న పోరాటపటిమను, సేవా జీవితాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు. ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన లచ్చన్న జీవితాన్ని యువతరంతో పాటు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, గౌడ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకపోతుల రాఘవయ్య, అధ్యక్షుడు బలగాని ఆంజనేయులు, ప్రచార కార్యదర్శి అనిల్, జిల్లా కోశాధికారి పాగోలు చింతయ్య, గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 118వ జయంతి వేడుకలు
నివాళులర్పించిన కలెక్టర్ పి.రాజా బాబు


