వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగల అపహరణ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. స్వల్పంగా గాలులు వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది.
సీఎస్ పురంలో
సీఎస్ పురం (పామూరు): పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసి బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీఎస్ పురం మండలం డీజీ పేట గ్రామానికి చెందిన పావలి వెంకటసుబ్బమ్మ (65) ప్రతిరోజూ పశువులకు మేత కోసం ఉదయం, సాయంత్రం గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లి వచ్చేది. గురువారం ఉదయం కూడా పొలానికి వెళ్లి గడ్డి తీసుకొచ్చింది. సాయంత్రం గడ్డి కోసం వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెంకటసుబ్బమ్మపై వెనుక నుంచి ఆయుధంతో దాడి చేశాడు. తల, మొహంపై గాయాలతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆమె మెడలోని బంగారు సరుడు, కమ్మలు తీసుకుని దొంగ పరారయ్యాడు. ముక్కుకు ఉన్న ముక్కెర తీసుకునేందుకు ఆమె మొహంపై కూడా బలంగా కొట్టడంతో గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి 108 వాహనంలో సీఎస్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంకటసుబ్బమ్మను తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందింది. మృతురాలి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసులు, పామూరు ఎస్సై కట్టా అనూక్, వెలిగండ్ల ఎస్సై రామకోటయ్య వైద్యశాలలో ఉన్న వెంకటసుబ్బమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని కనిగిరి క్లూస్ టీం ఏఎస్సై రవి ఆధ్వర్యంలో పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామూరు ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతిక కాయాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించనున్నట్లు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


