ఒంగోలు సిటీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒంగోలు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి గోనెల మేరి, సిటీ కార్యదర్శి గోనెల శివ, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షురాలు పేరం ప్రసన్న, సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెట్టెల వెంకటేష్ (వెంకు), సిటీ 6వ డివిజన్ అధ్యక్షుడు కటారి సాయి, బీసీ జిల్లా విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరితో పాటు కొండపి నియోజకవర్గానికి చెందిన జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు కొమ్ము ప్రభుదాస్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు దుగ్గిరాల పేరరాజు, కసుకుర్తి నవీన్, కసుకుర్తి శివాజీ (బద్రి)లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
మార్కాపురం: మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా త్వరలో వినూత్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నట్టు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ టీ జీవన్ తెలిపారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 7.15 గంటలకు ప్రసారమయ్యే ఉదయ కిరణాలు కార్యక్రమంలో ప్రతి గురువారం మానసిక ఆరోగ్యంపై, ప్రతి శనివారం సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8.35 గంటలకు ప్రసారమయ్యే హలో ఎఫ్ఎం కార్యక్రమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో వాట్సప్ ద్వారా పాటలు కోరే కార్యక్రమం, మంగళ, గురు, శనివారాల్లో లైవ్ ఫోన్ ఇన్ ద్వారా పాటలు కోరవచ్చని అన్నారు. సోమ, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 9.30 మహిళల కోసం లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.15 గంటలకు పాడిపంటల వివరాలు, మంగళ, గురు, శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమాలు ఇల్లు–వాకిలీ ప్రసారమవుతుందన్నారు. రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే యువవాణిలో వివిధ రకాల అంశాలపై యువతకు సమాచారం అందిస్తామన్నారు. పోటీ పరీక్షల శిక్షణ, కాలేజీ క్యాంపస్ ప్రోగ్రామ్స్, నూతన వ్యాపారాలు తదితర కార్యక్రమాలు ప్రసారం చేస్తారన్నారు. ఈనెల 9వ తేదీన ఆకాశవాణి 34వ ఆవిర్భావ దిన వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్కాపురం ఆకాశవాణి ప్రసారాలను ఓటీటీతో అనుసంధానం చేశామని, వేవ్స్ ద్వారా కార్యక్రమాలు వినవచ్చన్నారు. దీనితోపాటు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్లో కూడా ప్రసారాలాను వినవచ్చని చెప్పారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన స్థానిక గాయకులు, రచయితలు, కవులు, మేధావులు, జానపద కళాకారులు, వివిధ రంగాల నిపుణులు ప్రతిభ చాటేందుకు ఆకాశవాణి ముందుంటుందన్నారు.
ఒంగోలు సిటీ: ఏపీ టెట్లో భాగంగా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పరీక్షకు 640 మంది అభ్యర్థులకు గాను 570 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లాలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా పరీక్ష కేంద్రంలో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్కు 220 మందికి గాను 206 మంది హాజరు కాగా, 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 220 మందికి 188 మంది హాజరయ్యారు. 32 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కేంద్రంలో ఉదయం 100 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 86 మంది పరీక్ష రాశారు. రెండు సెషన్లలో కలిపి 24 మంది గైర్హాజరయ్యారు.
ఒంగోలు వన్టౌన్: ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో ఆగస్టు 17 నుంచి పురుషులకు 13 రోజుల పాటు సీసీ టీవీ కెమెరా ఇన్స్ట్టాలేషన్, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పీ శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు అర్హులని, వయసు 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. శిక్షణ పొందగొరే వారు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉండాల న్నారు. శిక్షణ కాలంలో ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 9573363141 ఫోన్ నంబర్ ను సంప్రదించాలన్నారు.


