లింగసముద్రం (కందుకూరు రూరల్):
లింగసముద్రం మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ ముత్తంవారిపాలెం గ్రామానికి చెందిన వై.మాల్యాద్రికి ఐదెకరాలు పొలం ఉంది. ఇందులో ఒక ఎకరా వీరాఘవపురం వాగు బోరంబోకు భూమి కలిసి ఉంది. ఈ పొలాన్ని ఎప్పుటి నుంచి మాల్యాద్రి సాగు చేసుకుంటున్నాడు. అందులో పత్తి పంట సాగు చేశాడు. అయితే పై ఎత్తున ఉన్న చెరువుకు వెళ్లేందుకు రోడ్డు వేయాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. మాల్యాద్రి వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి. దీంతో మాల్యాద్రిని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఎకరా పొలంలో రోడ్డు వేసేందుకు పూనుకున్నారు. పొలంలో రోడ్డు నిర్మాణానికి తనకు అభ్యంతరం లేదని, పొలం మధ్యలో కాకుండా ఒక వైపున రోడ్డు వేసుకోవాలని మాల్యాద్రి సూచించాడు. కానీ మాల్యాద్రిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులు పొలం మధ్యలో నుంచి రోడ్డు వేశారు. ఒక పక్కన వేసుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. నాకు పంట సాగు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులను, నాయకులను చెప్పినా పట్టించుకోకుండా దౌర్జన్యంగా రోడ్డు వేశారు. అందులో ప్రస్తుతం పత్తి పంట సాగు చేసి ఉంది. కొంత కాయతో ఉంది. మరి కొంత పత్తి తీసి ఉంది. కనీసం పత్తినైనా తీసుకునే వరకు ఆగాలని వేడుకున్నా ఆగకుండా పంటను ధ్వంసం చేసి రోడ్డు వేశారని మాల్యాద్రి వాపోయాడు. పత్తి పంటను ధ్వంసం చేసి నడి పొలంలో నుంచి రోడ్డు వేసి వారి పైశాచిక ఆనందం పొందుతున్నారు. చెరువుకు వెళ్లే దారికి పొలం చివరి ఒక వైపు వేసినా ఇబ్బంది ఉండదు. కానీ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తోటి రైతును ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఆ వాగు వెంబడి ఎంతో కాలం నుంచి మల్యాద్రితో పాటు మరి కొందరు వాగు పోరంబోకు భూమిని ఆయా రైతులు పొలాల్లో కలుపుకొని సాగు చేసుకుంటున్నారు. లింగసముద్రం, గుడ్లూరు ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకొని రోడ్డు వేస్తున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా, రైతులకు ఉపయోగకరంగా లేకపోయినా కావాలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా అధికారులను ఉపయోగించుకొని రోడ్డు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పత్తి పంట పొలంలో మధ్యలో రోడ్డు ఏర్పాటు
పోలీస్ పహారాలో రోడ్డు వేసిన టీడీపీ నాయకులు
నేతలు, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు


