రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో (నాగార్జునసాగర్ృశ్రీశైలం టైగర్ రిజర్వ్) ఇటీవల జరిగిన పెద్దపులి మృతిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, ప్రభుత్వ అటవీ సలహాదారు పి.మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్పాండే, వైల్డ్లైఫ్ సభ్యుడు షేక్ ఇమ్రాన్ సిద్ధిఖీ బృందం రాచర్ల మండలంలోని జేపీ చెరువు పరిధిలో పర్యటించింది. తెట్టుమడుగులో పులి కళేబరం లభ్యమైన ప్రదేశంతో పాటు లోతువాగు, పులిని చంపినట్లుగా భావిస్తున్న ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల నుంచి అధికారులు ఏడు పులి గోర్లు, ఓ నాటు తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ ఆధారాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నారు. కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు డీడీపీటీ( డిప్యూటి డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్)లు అబ్దుల్ రవూఫ్, నిషాకుమారి, రేంజ్ ఆఫీసర్ వీరస్వామి, డీఆర్వో వంశీకృష్ణకుమారి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ కనకరావు తదితరులు పాల్గొన్నారు.


