ముండ్లమూరు: మండలంలోని పసుపుగల్లు గ్రామ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీ స్థానిక రైతులను తీవ్ర ఆందళనకు గురిచేస్తోంది. బుధవారం తెల్లవారుజామున నాలుగు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు పొలాల్లో దిమ్మెల పైనున్న ట్రాన్స్ఫార్మర్లను కిందకు దించి, వాటిని ధ్వంసం చేసి లోపలి రాగితీగను అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన రైతులు ఏరువ సుబ్బారెడ్డికి చెందిన 16 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్తో పాటు.. కోటా శ్రీనివాసరెడ్డి, యారంకోట శ్రీనివాస్రెడ్డి, కాటం తిమ్మారెడ్డికి చెందిన 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే రైతులు పొలాలకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో చుట్టుపక్కల వెతకగా అవి ధ్వంసమై కనిపించాయి. వారు గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో, మిగతా రైతులు కూడా తమ ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి చూసుకునేందుకు పొలాలకు పరుగులు తీశారు. చోరీ విషయాన్ని గ్రామ లైన్మెన్ సోమ్లానాయక్కు తెలపగా, ఆయన విద్యుత్ శాఖ ఏఈ అంకబాబుకు ఫిర్యాదు చేశారు.
ఒకవైపు గస్తీ.. అదే సమయంలో చోరీ!
బుధవారం రాత్రి దర్శి సీఐ వై.రామారావు తమ సిబ్బందితో కలిసి చింతలపూడి పొలాల వైపు గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కొందరు రైతులు వెళ్లి, దక్షిణం వైపు పొలాల్లో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైన విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లారు.


