మిర్చి రైతుకు
పెద్దారవీడు:
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న కళ్లలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. చినుకై నా పడుతుందేమోనని రోజూ ఎదురుచూస్తున్నా.. మేఘాలు కమ్ముకుని నిరాశపరుస్తూ వెళ్లిపోతున్నాయి. ఊహించినట్లుగానే ‘ఎల్నినో’ ప్రభావం ఈ ఏడాది మిర్చి రైతుల పాలిట శాపంగా మారుతోంది. గతేడాది నష్టాలను పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి అధిక విస్తీర్ణంలో మిర్చి సాగుకు రైతులు ఆసక్తి చూపారు. అందుకు అనుగుణంగా ముందస్తుగానే పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ, నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నెలాఖరుకల్లా వరుణుడు కరుణించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షేడ్నెట్లలోనే ముదురుతున్న నారు
సాధారణంగా విత్తనం నాటిన 40 రోజులకు మిర్చి మొక్కలను పొలంలో నాటాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు ముందస్తుగా షేడ్నెట్లలో నారు పెంచుకున్నారు. ఒక్కో మొక్కకు 80 పైసల నుంచి రూ.1.50 వరకు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. కొందరు రైతులు విత్తనాలిచ్చి ట్రేల లెక్కన ఒప్పందంపై నారు పెంచుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ మొక్కలన్నీ నర్సరీల్లో ముదిరిపోతున్నాయి. బోరుబావుల ద్వారా నీటి వసతి ఉన్నప్పటికీ.. ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పుడు మొక్కలు నాటినా బతికే పరిస్థితి లేదని రైతులు వెనుకడుగు వేస్తున్నారు. మరో పది రోజుల్లోపు పొలాల్లో నాట్లు వేయకపోతే, నర్సరీల్లో నారంతా పనికిరాకుండా పోతుందని, రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుందని అటు రైతులు, ఇటు నర్సరీ నిర్వాహకులు వాపోతున్నారు.
వేలాది మంది ఉపాధిపై ప్రభావం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో మిర్చి సాగుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 200కు పైగా షేడ్నెట్ నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున మిరప నారు పెంచుతున్నారు. ఈ నర్సరీల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తోంది. వర్షాభావం ఇలాగే కొనసాగి మిర్చి సాగు నిలిచిపోతే.. అటు రైతులు, నర్సరీ నిర్వాహకులతో పాటు కూలీల ఉపాధికి సైతం గండిపడే ప్రమాదం పొంచి ఉంది.
వర్షాభావంతో సాగుపై నెలకొన్న సందిగ్ధం
షేడ్నెట్లలోనే ముదురుతున్న మిరప నారు
మరో పది రోజులు దాటితే రూ.లక్షల్లో నష్టం
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు
వర్షం పడకుంటే నారు వదిలేయాల్సిందే..
ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల మిరప సాగు బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నర్సరీ నిర్వాహకులకు విత్తనాలిచ్చి నారు పెంచుకుంటున్నాం. ఇక్కడి నర్సీరీల నిర్వాహకులు కూడా ఎక్కువ శాతం రైతులు కావడంతో మేలు రకం నారు దొరుకుతుందన్న నమ్మకం ఉంది. ఇంకో పది రోజుల్లో నాట్లు వేయాలి. సకాలంలో వర్షం కురవకపోతే లక్షలు నష్టపోతాం.
– కాసు వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెద్దారవీడు


