సంతమాగులూరు (అద్దంకి): చెడు వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాల వైర్లను అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను సంతమాగులూరు పోలీసులు అడ్డరోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలానికి చెందిన పల్లపు వెంకట సాయికుమార్ (ప్రస్తుతం యద్దనపూడి మండలం పూనూరు నివాసి), బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన మునిపల్లి ఏసుబాబు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలేనికి చెందిన లంకా వరప్రసాద్, తాటియేకుల నాగేంద్ర, తన్నీరు చిట్టిబాబు, మంచికలపూడి వెంకటేశ్వర్లు, తాడేపల్లికి చెందిన గంగుల కృష్ణ స్నేహితులు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ స్తంభాల మధ్య ఉండే అల్యూమినియం వైర్లను కత్తిరించి అమరావతి సమీపంలోని ఎర్రబాలెంలో ఉన్న ఓ వ్యాపారికి విక్రయిస్తుంటారు. అలాగే సంతమాగులూరులోని పీవీఆర్ రెసిడెన్సీ స్టోర్ రూమ్ తాళాలు పగులగొట్టి అందులోని సర్వీస్ వైరును కూడా అపహరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో సంతమాగులూరులో రెండు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు, బాపట్ల జిల్లా అనుములదీవి, వేమూరు, గుంటూరు జిల్లా తెనాలిలో మూడు, దుగ్గిరాలలో ఒకటి, పల్నాడు జిల్లా చిలకలూరిపేట, వినుకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 కిలోల రాగి వైరు, 150 కిలోల అల్యూమినియం వైరు, నిచ్చెన, కారు, వైరు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సంతమాగులూరు ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై వై.నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్ జిల్లా విద్యుత్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
ఏడుగురు నిందితుల నుంచి 7 కిలోల రాగి, 150 కిలోల అల్యూమినియం వైరు, కారు, పనిముట్లు స్వాధీనం
మీడియాకు వివరాలు వెల్లడించిన దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ


