ఒంగోలు సిటీ: జిల్లాలో ఐసీడీఎస్ నిబంధనలకు విరుద్ధంగా అంగన్వాడీ కార్యకర్తల భర్తీకి ఇచ్చిన నోటిఫికే షన్లను రద్దు చేసి, అర్హులైన హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్య దర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద బాధిత హెల్పర్లతో కలిసి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ.. ప్రమోషన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులను పక్కనపెట్టి, అధికారులు ప్రలోభాలకు గురై ఏకపక్షంగా భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వ డం అన్యాయమన్నారు. ఒక మంత్రి సొంత నియోజకవర్గమైన టంగుటూరు ప్రాజెక్టు పరిధిలోని పాకల, వాసేపల్లిపాడు సెక్టార్లలో అర్హతలున్నా హెల్పర్లకు ప్రమోషన్లు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. మరో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు ప్రాజెక్టు పరిధిలోని ధేనువకొండలో ఏకంగా ప్రమోషన్ దరఖాస్తులనే నిరాకరించడం అధికారుల తీరుకు నిదర్శనమన్నారు. హెల్పర్లకు ప్రస్తుతం ప్రమోషన్లు ఇవ్వకపోతే వయసు రీత్యా భవిష్యత్తులో కార్యకర్త అయ్యే అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని అక్రమంగా నోటిఫికేషన్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని, లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ ఇంద్రావతి, టంగుటూరు, ఒంగోలు ప్రాజెక్టుల కార్యదర్శులు క్రాంతికుమారి, కె.హెమీమా, హెల్పర్లు జ్యోతి సరస్వతి, నాగమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు అన్నపూర్ణ


