● పోలీస్ గ్రీవెన్స్లో ఎస్పీ హర్షవర్ధన్రాజు
ఒంగోలు టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ, చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సాధ్యమైనంత వరకు సత్వర న్యాయం అందించేలా పోలీసు అధికారులు కృషి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఎస్పీ స్వయంగా వినతులు స్వీకరించి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యలపై ఎస్పీ వెంటనే స్పందించి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా నిర్దేశిత సమయంలోగా ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. అవసరమైతే అధికారులే స్వయంగా ఘటనా స్థలాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ బాబు, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ సింగ్, గ్రీవెన్స్ ఎస్సై షేక్ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.


