ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో చినుకు జాడలేదు. పచ్చదనంతో కళకళలాడాల్సిన పొలాలు వర్షాభావంతో ఎడారిని తలపిస్తూ బీడుగా మారాయి. వానలు లేక చాలామంది రైతులు సాగుకు దూరమయ్యారు. అరకొర బోరు నీటితో కొందరు పత్తిని కాపాడుకుంటుండగా.. మెట్ట ప్రాంతాల్లో వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పనులు లేక రైతులు, వ్యవసాయ కూలీలు అల్లాడుతున్నారు. అసలు వర్షాలు కురుస్తాయో, లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. వానలు పడితే ప్రత్యామ్నాయ పంటలైనా వేసుకుందామని రైతులు భూములు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. మొత్తానికి రైతులకు వ్యవసాయం కత్తిమీద సాములా మారింది.


