రైతుల దగ్గర ధాన్యం నిల్వలు అయిపోయాక ఎక్స్పోర్టుకు అనుమతి దీంతో విపరీతంగా పెరిగిన ధాన్యం ధరలు బియ్యం ధరలకు కూడా రెక్కలు
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా వరిధాన్యం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంపై అటు రైతులు, ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కోతల సమయంలో ప్రభుత్వాలు ఎక్స్పోర్టుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పెద్దగా డిమాండ్ లేక దళారులు ధరలు దిగ్గోసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం కూడా వరికోతల సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చివరి దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించి చివరికి మమ అనిపించారు. తీరా రైతుల దగ్గర ధాన్యం నిల్వలు అయిపోయాక విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ధాన్యం లేక ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కోతల సమయంలో ఎగుమతులకు అనుమతి ఇచ్చి ఉంటే రైతులకు లబ్ధి చేకూరేదని అంటున్నారు. ఇటీవల ఎగుమతులకు అనుమతి వచ్చిన తరువాత ధాన్యం 75 కేజీల జీలకర మసూర, కేఎన్ఎం రకం రూ.2,700 ఉండగా ఆదివారానికి జీలకర మసూర రకం రూ.2,800 లు ఉండగా, కేఎన్ఎం రకం రూ.3 వేలు ఉంది. చివరకు ధాన్యం ధరలు గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా షేర్ మార్కెట్ను తలపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో రైతులు కూటమి ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు రైతుల నోట్లో మట్టికొట్టి దళారులకు, బడా వ్యాపారులకు లబ్ధిచేకూర్చేలా ఉన్నాయని మండిపడుతున్నారు. మరో పక్క ధాన్యం ధరలు పెరగటంతో బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. 25 కేజీల జీలకర రకం మసూర రకం నిన్నటి వరకు రూ.1,200 నుంచి రూ.1,300 ఉండగా ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,600 ఉన్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ధరలు అమాంతం పెరగటంతో వ్యాపారులు సాధారణ బియ్యం లో రేషన్ బియ్యం కలుపుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్ బియ్యం పక్కదారులు పట్టకుండా తగిన చర్యలు తీసుకుని బియ్యం ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


