ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో కార్మికులకు పెండింగ్లో ఉన్న గత సమ్మె కాలపు వేతనం వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు మస్టర్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంతపేటలోని వార్డు సచివాలయంలోని మస్టర్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. సీఐటీయూ పారిశుధ్య కార్మికులు యూనియన్ నగర కార్యదర్శి టి.విజయమ్మ మాట్లాడుతూ పారిశుధ్యం కార్మికులు గత మూడు నెలల నుంచి సమ్మె కాలపు వేతనాలు ఏడు రోజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులకు అనేక దఫాలుగా విన్నవించుకున్నా సమస్యలు పరిష్కారం చేయట్లేదని ధ్వజమెత్తారు. స్థానిక ఐదో డివిజన్ మస్టర్ పాయింట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం జీఓ వచ్చి మూడు నెలలు అవుతున్నా నేటికీ ఒంగోలు పారిశుధ్య కార్మికులకు వేతనం చెల్లించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేతనంతో పాటు సమ్మెకాల వేతనం కూడా చెల్లిస్తామని చెప్పారని, కానీ వేతనం ఒకటో తేదీన వేసినా కానీ సమ్మె కాలపు వేతనం రాలేదన్నారు. వెంటనే సమ్మె కాలం వేతనం ఇవ్వాలని. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తల్లికి వందనం కార్మికులందరికీ వర్తింపచేయాలని నినాదాలు చేశారు. నాయకులు కె.శ్రీనివాసరావు, యు.రత్నకుమారి, ఆర్.శ్రీనివాసరావు, జి.నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఽ
ప్రభుత్వం జీఓ ఇచ్చినా నిర్లక్ష్యం
సంతపేట సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికుల నిరసన


