మేదరమెట్ల: రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అటుగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్స్లో వంట మాస్టర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఒంగోలు వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతుడి వివరాల కోసం అతని వద్ద ఉన్న సంచిలో వెతకగా ఎలాంటి సమాచారం అందలేదు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం అప్పుడప్పుడూ హోటల్స్లో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడని, ఇతను చైన్నెకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చీమకుర్తి రూరల్: ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం జలాశయం వద్ద శనివారం వెలుగుచూసింది. పిడుగురాళ్ల లెనిన్ నగర్కు చెందిన అబ్దుల్ రెహమాన్ (22) రామతీర్థం జలాశయానికి అనుసంధానంగా ఉన్న సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లి నీటి ప్రవాహ ఉధృతికి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అతను బోర్వెల్స్ యజమాని అని తెలిసిందని సీఐ ప్రసాద్ చెప్పారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఒంగోలు జీజీహెచ్కి తరలించామని, ఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ వెల్లడించారు.


