కొండపి: మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్న మఠంగా ప్రసిద్ధిగాంచిన జాళ్లపాలెం గ్రామంలో ఏటా ఉగాది రోజున తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. హోమగుండంలో కొబ్బరి చిప్పలు వేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చూండూరి రవిబాబు, సీఈసీ సభ్యుడు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు నడిపింది. పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ, మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేశారు. డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొండపి సీఐ సోమశేఖర్ సహ ముగ్గురు సీఐలు, ఎస్సై ప్రేమ్కుమార్ సహా 11 మంది ఎస్సై లు, 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


