
రాష్ట్రంలో రౌడీరాజ్యం
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని రౌడీరాజ్యంగా చేశారని, అందుకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పులివెందుల పేరు చెపితే గుర్తుకు వచ్చే నాయకుడు వైఎస్సార్ అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా, చరిష్మా కలిగిన నాయకుడిగా వైఎస్సార్ గుర్తుకు వస్తారని తెలిపారు. పులివెందుల సిటీని తలపించేలా అభివృద్ధి చేశారన్నారు. అక్కడ ఇంటర్నల్ డ్రైనేజీ ఉంటుందని, ప్రాథమిక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ వరకు పాఠశాలలు, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, న్యాయస్థానం అక్కడ ఉన్నాయన్నారు. పులివెందుల బస్టాండ్, మార్కెట్ యార్డ్లను రాష్ట్రంలో మరెక్కడా చూడలేమని, అక్కడ ఉన్న రోడ్లు ఉద్యానవనంలా కనిపిస్తాయన్నారు. అటువంటి ప్రాంతంలో ఎన్నికలు చేయాలంటే చంద్రబాబు నాయుడికి శక్తి, దమ్ము సరిపోలేదని, ఎన్నికలు సక్రమంగా చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయపడ్డారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీచేస్తే ఇద్దరికే ఓట్లు పోలయ్యాయని, మిగిలిన ఎవరికీ ఓట్లు పడలేదన్నారు. దొంగ ఓట్లు వేసే వాడికి 100 టీడీపీకి, ఒక ఓటు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గుద్దాలని చెప్పారని, మిగిలిన 9మంది మిగిలి పోయారనే అలోచనే వారికి లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికలు ఇంకొకటి లేవన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ జరపాలని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ ఎర్రబుక్ అంటూ ఎర్రిపాలన చేసుకుంటూ పోతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో ఒక ట్వీట్ చేశాడని, ఆ పాలన ఎలాగుందో ట్వీట్ కూడా అలాగే ఉందని, ఆ పోస్టులో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున ఉండటం గమనించలేకపోయాడన్నారు. అదే విధంగా కలెక్టర్ చేసిన ట్వీట్లో దొంగ ఓటర్లు ఉన్నారని ప్రెస్మీట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించగానే ఆ ట్వీట్ను కలెక్టర్ డిలీట్ చేశారని, ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వందల మంది టీడీపీ వాళ్లతో దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, సూరె రమేష్, వై.వెంకటేశ్వరరెడ్డి, పల్లె సరళ, ఎనిబెర శార, షేక్ ఫజూల్ పాల్గొన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలే నిదర్శనం
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం