
ఇళ్లు లేని చోట సిమెంట్ రోడ్డా..!
ఎంపీ అనుమతిచ్చారు..అధికారులు వేశారు..
నివాస గృహాలు ఉన్న చోట వదిలేసి ఇళ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసి ఔరా అనిపిస్తున్నారు కూటమి పాలకులు..మూడు నెలల కిందట కంభం మండలానికి రూ.60 లక్షల ఎంపీ నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా హజరత్ గూడెం పంచాయతీ పరిధికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. హజరత్ గూడెం పంచాయతీ కంభం, కందులాపురం పంచాయతీల్లో కలసి పోయి ఉంటుంది. హైవే సమీపంలో, వాసవీ స్కూల్, గౌతమి స్కూల్ వెనుక వైపున, బస్టాండుకు హైవేకి మధ్యలో ఉండే గృహాల ద్వారానే హజరత్ గూడెం పంచాయతీకి అధికంగా పన్నులు వసూలయ్యేది. ఆ ప్రాంతాన్ని వదిలేసి ప్రస్తుతం హైవేపై ఉన్న ఫంక్షన్ హాలు పక్క వీధిలో రూ.10 లక్షలు వెచ్చించి 158 మీటర్ల సిమెంటు రోడ్డు వేశారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇదేంటని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తే..ఎంపీ కార్యాలయం నుంచే ఎక్కడ రోడ్డు వేయాలో పేరుతో సహా మంజూరై వచ్చిందని సమాధానమిస్తున్నారు. దీంతో వారు నివ్వెరపోతున్నారు. చాలా వీధుల్లో ఇళ్లు ఉన్నా సిమెంటు రోడ్లు వేయలేదని.. అసలు ఇళ్లు లేని చోట సిమెంటు రోడ్డు వేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిధులు ప్రజలకు ఉపయోగపడకపోతే ఎలా అంటూ వాపోతున్నారు.
– కంభం