
వేసవి శిక్షణతో విజ్ఞానం, వికాసం
ఒంగోలు టౌన్: బాల్యం నుంచే పిల్లలకు గ్రంథాయాలకు వెళ్లేలా అలవాటు చేయాలని డీఈఓ అత్తోట కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా చిన్నారులు ప్రతి రోజూ గ్రంథాయాలకు వెళ్లి పుస్తకాలు చదివితే విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చన్నారు. గ్రామర్, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్, పప్పెట్ మేకింగ్, డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా మానసిక వికాసం కలుగుతుందన్నారు. 40 రోజులపాటు సాగే వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవిలో చిన్నారులను శిక్షణ తరగతులకు పంపించాలని తలిదండ్రులకు సూచించారు. మంచి అలవాట్లే పిల్లల ఉన్నతికి కారణమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షకులతోపాటు గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.
చిన్నారులకు గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేయాలి
డీఈఓ కిరణ్ కుమార్