
టెన్షన్ పెట్టిన చిన్నారులు
● రెండు గంటల తరువాత తల్లిదండ్రుల
చెంతకు చేర్చిన పోలీసులు
ఒంగోలు టౌన్: నగరంలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకుంటున్న చిన్నారులు తప్పిపోయారు. రెండు గంటలకు పైగా గాలించిన తరువాత పోలీసులకు దొరికారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అన్నవరప్పాడులో ఉన్న ఒక ప్రైవేట్ విద్యానికేతన్లో షేక్ ఇస్మాయిల్, కొంపసాల బిల్వనాథ్, అప్పాడిపాడు పార్ధులు మూడో తరగతి చదువుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు స్కూలు వదిలిపెట్టారు. పుస్తకాల సంచులను స్కూలులోనే ఉంచిన చిన్నారులు స్కూలు బయటకు వెళ్లారు. అలా వెళ్లిన వారు తిరిగి రాలేదు. ఈ లోగా తలిదండ్రులు వచ్చి తమ చిన్నారుల కోసం చూడగా స్కూలులో కనిపించలేదు. పాఠశాల స్బిబందిని అడిగితే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, అంతలోనే ఎక్కడకు వెళ్లారంటూ చెప్పడంతో తలిదండ్రులు గుండెల్లో రాయి పడ్డట్టయింది. దీంతో పిల్లలు కనిపించకుండా పోయారన్న విషయం స్కూలు యాజమాన్యానికి తెలిసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తలిదండ్రులు పిల్లల కోసం వీధుల వెంట గాలింపు మొదలు పెట్టారు. ఎక్కడకు వెళ్లినా పిల్లలు కనిపించకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. చివరకు టూటౌన్ పోలీసులకు తెలిపారు. వారు కూడా రంగంలోకి దిగి గాలించగా చివరికి బాలాజీనగర్లో అగ్రహారం రైల్వే గేటు వద్ద విద్యార్థులు కనిపించారు. టూటౌన్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు సమక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో చిన్నారుల తలిదండ్రులు, స్కూలు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. తప్పిపోయిన పిల్లలను కేవలం రెండు గంటల వ్యవధిలోనే తలిదండ్రులకు అప్పగించడంలో సహకరించిన సీఐకు ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.