
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీ
కంభం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం కంభం పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. స్థానిక జామియా మసీదు వద్ద నుంచి ముస్లింలు జాతీయ జెండాలు, ఫ్లకార్డులు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. జామియా మసీదు సెంటర్ నుంచి సర్కిల్ కార్యాలయం, చౌక్సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మీదుగా కందులాపురం కూడలి వరకు ర్యాలీ సాగింది. కందులాపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి వక్ఫ్సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కిరణ్కు వినతిపత్రం అందజేశారు.
శాంతీర్యాలికి ప్రజాసంఘాల సంఘీభావం
ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతిర్యాలీకి ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, పీఏఎఫ్, సీఐటీయూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపాయి. ఈ సంధర్భంగా ఎమ్మార్పీయస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెం రాజు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు పూర్తిగా ముస్లింలకు సంబంధించినవేనని, అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముస్లిం మత పెద్దలు పరిష్కరించుకుంటారన్నారు. టీటీడీ, ఇతర కమిటీల్లో ముస్లింలకు స్థానం కల్పించనప్పుడు పూర్తిగా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్లో ముస్లింమేతరులకు ఎలా అధికారాలు కట్టబెడతారని ప్రశ్నించారు. వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల నాయకులు జయరాజ్, అన్వర్, ఇబ్రహీం, అబ్రహం, ముస్లిం పెద్దలు ప్రభుత్వ హాజీ ఆరీఫ్, ముఫ్తీ యాసీన్, కలాం, సయ్యద్ జాకీర్ హుస్సేన్, డిష్మున్నా, సయ్యద్ ఖాసిం, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ముస్లింలు పెద్ద ఎత్తున్న శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాలు, మసీదుల నుంచి వచ్చిన ముస్లింలు స్థానిక బస్టాండ్ సెంటర్లోని నూరాని మజీద్ వద్దకు చేరుకున్నారు. కొంతమంది జాతీయ పతాకాలు, మరి కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి మార్కాపురం–మాచర్ల రోడ్డులో కదం తొక్కారు. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజా స్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ముస్లిం పెద్దలు, మౌలానాలు హిదాయతుల్లా, మహమ్మద్ ఉసేన్, యునిస్, జుబేర్, షేక్ జిలాని, సయ్యద్ షాబీర్, సయ్యద్ జబీవుల్లా, ఎం.కరీముల్లా బేగ్, షేక్ ఇస్మాయిల్, అమానుల్లాబేగ్, ఫజుల్, రఫీ, మస్తాన్వలి, షేక్ కాశింపీరా, షేక్ వలి, మహమ్మద్ కాశిం, కాశింబాష పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీ