మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య
ఒంగోలు అర్బన్: స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ దినేష్కుమార్ శనివారం పరిశీలించి తనిఖీ చేశారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో వినియోగించేందుకు ఇప్పటికే జిల్లాకు చేరిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల తొలి దశ పరిశీలన ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి 23 రోజుల పాటు జరుగుతుందన్నారు. అందుకోసం బెంగళూరు ఎల్ కంపెనీ నుంచి 15 మంది నిపుణులు వస్తారని తెలిపారు. ఆ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా ప్రక్రియ పూర్తి కావాలని, బారికేట్లు, అవసరమైన భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఎన్నికల విభాగం అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మూడో దశ రీ సర్వే పూర్తి చేయాలి
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
ఒంగోలు అర్బన్: జిల్లాలో చేపట్టిన మూడో దశ రీ సర్వేని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం స్థానిక ప్రకాశం భవనంలో రీ సర్వేపై సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ అధికారులు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశ గ్రామాలకు సంబంధించి మ్యుటేషన్ గ్రౌండ్ ట్రూథింగ్ దశలోనే గుర్తించి వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ కిషోర్బాబు, ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
14 రోజులకే చంద్రబాబు విలవిల
● 16 నెలలు జైలులో ఉండి కూడా చిరునవ్వుతో బయటకు వచ్చిన జగన్
● బీజీపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య
చీమకుర్తి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 14 రోజులు జైలులో ఉన్నందుకే విలవిల్లాడిపోతున్నాడని, అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నప్పటికీ చిరునవ్వులతో బయటకు వచ్చాడని బీజీపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అన్నారు. శనివారం చీమకుర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్కు ఆత్మవిశ్వాసం తగ్గలేదని, చిన్న వయసులోనే ప్రజల్లోకి వెళ్లి అందరి మన్ననలు అందుకున్నారని, అందుకే సీఎం అయ్యారని ప్రశంసించారు. ఎస్సీ వర్గీకరణ హేతుబద్దంగా చేయకపోవడం వలనే చంద్రబాబు 2004లో ఓడిపోయాడని, సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నా వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి విలువలను తుంగలో తొక్కడం వలనే 2019లో మరోసారి ఓటమి పాలయ్యాడని దారా సాంబయ్య అన్నారు. 14 రోజుల జైలుకే ఆత్మవిశ్వాసం కోల్పోయి విలపిస్తుంటే టీడీపీ కార్యకర్తల్లో ఏం విశ్వాసాన్ని నింపగలరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పొద వరప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిలర్ సంకె సుబ్బారావు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు బొడ్డు శంకర్, రూరల్ అధ్యక్షుడు బొడ్డపాటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రీ సర్వేపై సమావేశం నిర్వహిస్తున్న జేసీ
గోదాము వద్ద అధికారులతో కలెక్టర్ దినేష్కుమార్


