మాట్లాడుతున్న సంతనూతలపాడు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి
చీమకుర్తి: ప్రజల సమస్యలను పరిష్కరించమని తహసీల్దార్ దృష్టికి తీసుకుపోతే దానిని వదిలేసి దాడిచేశాడని తహసీల్దార్ ఎస్ఎల్ నారాయణరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సంతనూతలపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం సంతనూతలపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు, తనకు మధ్య జరిగిన వివాదాన్ని వివరించారు. విద్యార్థులకు సంబంధించించిన దాదాపు 600 సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని, దానితో పాటు ఆర్ఐ ప్రసాదరావుకు జీతాల బిల్లులు చేసి త్వరగా జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను అడిగానని చెంచిరెడ్డి చెప్పారు. దానిపై తహసీల్దార్కు, తనకు మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. అంతే తప్ప భూములను ఆన్లైన్ చేయమని తహసీల్దార్ను అడిగింది లేదని, లేనిపోని ఆరోపణలు చేసి పోలీస్స్టేషన్లో తహసీల్దార్ తనపై ఫిర్యాదు చేస్తే దానిని ఎల్లో మీడియాలో అభూత కల్పనలతో తనకు సంబంధం లేని వార్తలను రాయడం పట్ల దుంపా చెంచిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ దుంపా యలమందారెడ్డి, టీ.శేషిరెడ్డి, ఎస్కే రహంతుల్లా, ఏటి మురళి, వల్లెపు శ్రీను, చిరంజీవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఐ సస్పెన్షన్:
తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గొడవలలో ఆర్ఐ ప్రసాదరావు బాధ్యతా రాహిత్యమే కారణమని, ఆయన విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆర్ఐ ప్రసాదరావును సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులను ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు పంపించారు. తహసీల్దార్ కార్యాలయంలో తన విధులను ఆటంకపరిచి తనపై దాడిచేసినట్లు తహసీల్దార్ ఎస్ఎల్ నారాయణరెడ్డి మంగళవారం రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేశారు.
దాడిచేశానని తహసీల్దార్ తప్పుడు ఆరోపణలు ఎస్ఎన్పాడు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి


