సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.
‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.
‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు.
..తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?.
..ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్.
..నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


